గోపీచంద్ తో `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించబోయే హై బడ్జెట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆగష్టు నుండి పని చేయనున్నాడు. ఈ చిత్ర కథా నేపథ్యం 70 వ దశకంలో సాగుతుందని, అది కూడా యూరప్ కి సంబంధించినదని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలోని మెజారిటీ భాగం యూరప్ లో చిత్రీకరించనున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశం ఏంటంటే కథ, కథనాలు వైవిధ్యంగా ఉండటంతో పాటు, ఈ చిత్రంలో కొన్ని ఫాంటసీ అంశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం, హైదరాబాద్లో ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ పర్యవేక్షణలో, ఈ చిత్ర షూటింగ్ కొరకు భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కనుంది. 2019 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తుంది.