
‘కొచ్చాడయన్’, ‘లింగా’ లాంటి రెండు భారీ డిజాస్టర్ల తర్వాత రజనీకాంత్ చాలా చిక్కుల్లో ఇరుక్కున్నారు. అర్థిక లావాదేవీల విషయంలో, పంపిణీదారుల గొడవలో ఇలా ప్రతీ విషయంలో రజనీకాంత్ పేరును బయటకు తెచ్చి ఆయనకు ఇబ్బందులు కలిగించారు. ఇక తాజాగా.. ఆయన మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు. ముకుల్చంద్ బోద్రా అనే ఫైనాన్షియర్ రజనీకాంత్పై పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, రజనీని కౌంటర్ దాఖలు చేయమని నోటీసులు పంపింది. ప్రముఖ దర్శకుడు, ధనుష్ తండ్రి అయిన కస్తూరి రాజా ముకుల్చంద్ వద్ద 65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. అందుకు ష్యూరిటీగా రజనీకాంత్ పేరును నమోదు చేశారట. ఇప్పుడది రజనీని చిక్కుల్లో పడేసింది.
అయితే, ‘మై హూ రజనీకాంత్’ పేరుతో తెరకెక్కిన సినిమా పట్ల అభ్యంతరం తెలియజేస్తూ రజనీ కోర్టుకు వెళ్ళడమే ఈ పిటిషన్ వేయడానికి కారణంగా తెలుస్తోంది. మై హూ రజనీకాంత్ సినిమాకి మకుల్చంద్ నిర్మాత. తన సినిమాను ఆపినందుకుగాను ఆయన రజనీపై రివర్స్లో వచ్చి ఇలా చేశారని తమిళ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.