టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. అయితే తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక చేదు జ్ఞాపకాన్ని ఆయన తాజాగా పంచుకున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ ‘చందమామ’లో నవదీప్ చేసిన హీరో పాత్రకు మొదట అడివి శేష్నే తీసుకున్నారట.
కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగాక, శేష్ నటన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కృష్ణవంశీ ఆయన్ని సినిమా నుంచి తప్పించాడట. అప్పట్లో నటనలో తగినంత పట్టు లేకపోవడం వల్లే ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయానని శేష్ నిజాయతీగా అంగీకరించాడు.
కానీ ఆ తర్వాత ‘పంజా’, ‘క్షణం’ చిత్రాలతో తనను తాను నిరూపించుకున్న ఆయన, నేడు భారీ బడ్జెట్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. ‘డెకాయిట్’ చిత్రంతో శేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
