భారీ మొత్తానికి అమ్ముడైన ‘మనమంతా’ సాటిలైట్ రైట్స్!

manamatha
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా చంద్రశేఖర్ ఏలేటికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పటికప్పుడు విలక్షణమైన కథలను మనకు అందిస్తూ, తెలుగులో తనదైన బ్రాండ్ సృష్టించుకున్నారాయన. ఇక తాజాగా ఆయన మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, నాటితరం స్టార్ హీరోయిన్ గౌతమిలతో కలిసి ‘మనమంతా’ అనే సినిమాతో ఆగష్టు 5న మనముందుకొచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్ స్టైల్ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సినీ అభిమానులు, ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి ఆదరణ తెచ్చుకుంటోంది.

ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా పెద్ద మొత్తానికి అమ్ముడవడం విశేషంగా చెప్పుకోవాలి. తెలుగు, మళయాలం.. రెండు భాషలు కలుపుకొని మాటీవీ సంస్థ ఈ సాటిలైట్ హక్కులను సుమారు 6.80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఒక మిడిల్ లెవెల్ బడ్జెట్ సినిమాకు ఈ స్థాయి సాటిలైట్ బిజినెస్ జరగడం సినిమాకు వచ్చిన మంచి టాక్ వల్లే అని చెప్పుకోవచ్చు. వారాహి చలనచిత్రంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా నలుగురి జీవితాల్లోని కొన్ని సంఘటలను కలుపుతూ ఓ కథగా చెప్పిన రియలిస్టిక్ సినిమాగా పేరు తెచ్చుకుంది.

Exit mobile version