సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో శివ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. రజనీ ప్రస్తుతం హిమాలయాల్లో ఉండగా శివ ప్రీ ప్రొడక్షన్ వర్క స్టార్ట్ చేశారు. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో రజనీ సరసన నటించబోయే హీరోయిన్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు రజనీకాంత్ అల్లుడు ధనుష్ తాజా చిత్రం ‘అసురన్’లో కథానాయకిగా నటించిన మంజు వారియర్.
సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘అసురన్’లో మంజు వారియర్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దర్శకుడు శివ కూడా సినిమా చూసి రజనీ సరసన మంజు వారియర్ అయితే బాగుంటుందని, ఆమెనే తీసుకోవాలని నిశ్చయించుకున్నారట. ఈ విషయాన్ని నిర్మాతలతో చెప్పగా వారు కూడా సుముఖంగానే రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్ నుండి మాత్రం ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు.
రజనీ మొదటిసారి శివతో చేస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని రజనీతో ‘రోబో, పేట’ సినిమాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
