తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూశారు. తన 72 ఏళ్ల వయసులో ఆయన నేడు గుండెపోటుతో మరణించారు. కొన్ని నెలల కిందటే ఆయన కుమారుడు గుండెపోటుతోనే చనిపోగా, ఆ బాధతో రఘునాథ్ మానసికంగా కుంగిపోయారు. ఆ బాధలోనే ఆయన నేడు మరణించారు. రఘునాథ రెడ్డి స్వస్థలం విజయవాడ. మొదట్లో ‘ఆకాశ రామన్న’, ‘ ధర్మో రక్షిత రక్షితః’ వంటి నాటకాలతో పేరు తెచ్చుకున్నారు.
కాగా 1991లో శోభన్ బాబు ప్రధాన పాత్రలో పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించిన ‘సర్పయాగం’ సినిమాతో నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రఘునాథ రెడ్డి సుమారు 370 కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు. గతంలో తనకు మూడుసార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు రఘునాథ్ రెడ్డి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొందరు సినీ ప్రముఖులు కోరారు. ఇక మా 123తెలుగు.కామ్ తరఫున నటుడు రఘునాథ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
