రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రూడ్ ఆయిల్ మార్కెట్ లో భారీ ఎత్తుగడ వేసింది. అమెరికా ప్రభుత్వం ఇరాన్ పై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకంగా 5 మిలియన్ బ్యారెల్స్ ఇరాన్ క్రూడ్ ఆయిల్ ను రిలయన్స్ కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు 350 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఒక భారతీయ కంపెనీ ఇరాన్ తో ఇలాంటి భారీ ఆయిల్ డీల్ చేసుకోవడం ఇదే తొలిసారి.
ఒకప్పుడు ఇండియాకు ఇరాన్ నుంచి భారీ స్థాయిలో ఆయిల్ వచ్చేది. కానీ 2019లో అమెరికా కఠినమైన ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య ఆయిల్ ట్రేడ్ పూర్తిగా ఆగిపోయింది. తాజాగా గ్లోబల్ మార్కెట్ లో ఏర్పడిన ఎనర్జీ క్రైసిస్ కారణంగా అమెరికా తన ఆంక్షలను సడలించక తప్పలేదు. సరిగ్గా ఇదే సరైన సమయం అనుకున్న రిలయన్స్, వెంటనే రంగంలోకి దిగి ఈ భారీ డీల్ ను క్లోజ్ చేసింది.
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, ఇది కేవలం ఒక సాధారణ బిజినెస్ డీల్ కాదు.. పక్కా ప్లానింగ్ తో చేసిన హై-స్పీడ్ ఎనర్జీ డిప్లమసీ. ఒకవైపు గ్లోబల్ మార్కెట్ లో ఆయిల్ రేట్లు, సప్లై ఎలా ఉంటుందో అని ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతుంటే, ఇండియా మాత్రం చాలా స్మార్ట్ గా అడుగులేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఏ చిన్న మార్పు వచ్చినా, దాన్ని మన దేశ అవసరాలకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో రిలయన్స్ ఈ డీల్ ద్వారా నిరూపించింది.
ఈ అనూహ్య నిర్ణయంతో ఇతర దేశాలు కూడా ఇండియా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. అదను చూసి వేగంగా స్పందించడం వల్ల, మన ఎనర్జీ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడుకోవచ్చని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో ఆసియాలోని మిగతా దేశాలు కూడా ఇరాన్ ఆయిల్ కోసం ఇదే బాట పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
