టాలీవుడ్ హీరో శర్వానంద్ (Charming Star #38), దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా యాక్షన్ డ్రామా ‘భోగి’. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం సినిమా నుంచి సరికొత్త స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది.
ఈ చిత్రంలో శర్వానంద్ ‘గంగ’ అనే పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. “గంగ ఒక్కడే… ప్రాణాలు ఐదు” అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ పూర్తి గ్రామీణ వాతావరణంలో, సహజత్వానికి అద్దం పట్టేలా ఉంది. చేతిలో కొడవలి పట్టుకుని, అక్కాచెల్లెళ్లకు తాటి ముంజలు కోసి ఇస్తూ కూర్చున్న శర్వానంద్ లుక్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని హైలైట్ చేస్తూ మేకర్స్ ఈ పోస్టర్ను డిజైన్ చేశారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె. రాధామోహన్ ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతీ కీలక పాత్రల్లో నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం సమకూరుస్తుండగా, ఎ. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
