ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా సూపర్హిట్ టాక్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నేడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది.
ఈ కార్యక్రమంలో నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన మా శ్రీకారం సినిమా శర్వానంద్ కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ను వసూలు చేసిందని, ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హ్యుమన్ వేల్యూస్, ఎమోషన్స్ను దర్శకుడు కిషోర్ తెరపై చాలా నేచురల్గా చూపించాడని, మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు డెఫినెట్గా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యిందని అన్నారు. ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి ఇంకా మంచి కలెక్షన్స్ వస్తాయని నమ్మకం మాకు ఉందని అన్నారు.
రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుగానే సినిమా చూసిన ప్రతి ఒక్కరు తృప్తిగా బయటకు వస్తున్నారని, వాళ్లు చూడటమే కాకుండా వాళ్ల తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లి సినిమా చూపిస్తున్నారని అప్పుడే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందని అన్నారు. ఇలాంటి మంచి సినిమాకు పనిచేశామని చాలా గర్వంగా ఉందని, దర్శకుడు కిషోర్ చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడని, నిర్మాతలు కూడా ఆయనకు అండగా నిలబడ్డారని అన్నారు.
దర్శకుడు బి.కిషోర్ మాట్లాడుతూ ఈ కథ రాసుకున్నప్పటి నుంచి డెఫనెట్గా కొన్ని సీన్స్ వర్కవుట్ అవుతాయని అనుకున్నామని, అనుకున్నట్టుగానే ఆ సీన్స్కు మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. మంత్రి కేటీఆర్గారు, చిరంజీవిగారు రిలీజ్కు ముందు సపోర్ట్ చేస్తే, రిలీజ్ తర్వాత డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, బాబీ, అజయ్ భూపతి సినిమాకు సపోర్ట్ చేస్తున్నారని వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.
డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ ఈ సినిమా నిన్న రాత్రి చూశానని చాలా బాగుందని అన్నాడు. దర్శకుడు కిషోర్ 2016లో శ్రీకారం సినిమా షార్ట్ ఫిలింగా తీశాడని, ఇప్పుడు దానినే ఫీచర్ ఫిలింగా మలిచాడని, తొలి సినిమాకే ఇలాంటి స్టోరి ఎంచుకోవడం గొప్ప విషయమని అన్నారు. నేను పల్లెటూరి నుంచి వచ్చాను కాబట్టి సినిమాకు వెంటనే కనెక్ట్ అయ్యాను. యూత్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా శ్రీకారం అని అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ డైరెక్టర్ కిషోర్ ఈ కథను చాలా బాగా నెరేట్ చేశాడని అన్నారు. నేను చేసిన ఏకాంబరం క్యారెక్టర్ పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని, ఓ స్టూడెంట్లా ఆ పాత్ర చేసి కొన్ని విషయాలను నేర్చుకున్నానని అన్నాడు. రామ్, గోపీ ఆచంటలు చాలా డేడికేటెడ్ ప్రొడ్యూసర్స్ అని సినిమాపై ప్యాషన్ ఉన్నవాళ్లు కాబట్టి ఇంత మంచి సినిమా తీశారని అన్నారు.
హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ శ్రీకారం సినిమాను ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని, తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇదని అన్నారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ శ్రీకారం ఓ హానెస్ట్ మూవీ అని ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ అని చెప్పుకొచ్చారు. నిన్న నా స్నేహితుడొకరు ఫోన్ చేసి శ్రీకారం సినిమా చాలా బావుందని, చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు. నిన్న రాత్రి నేను కూడా ఈ సినిమా చూశానని ఇంత మంచి సినిమాను తీసిన దర్శకుడికి, నిర్మాతలకు థాంక్స్ చెప్పాలన్నాడు.
ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ శ్రీకారం సినిమా చూడగానే దర్శకుడు కిషోర్ తాను చెప్పాలనుకున్న పాయింట్ను జెన్యూన్గా చెప్పాడని, నేను అప్పుడప్పుడు సంక్రాంతికి ఇంటికెళ్లినప్పుడు టౌన్ నుంచి వాళ్ల పిల్లలు వస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తుండటాన్నిగమనించాను. కాబట్టి ఈ సినిమా నాకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యిందని అన్నాడు. మనలో తొంబై శాతం మంది పల్లెటూర్ల నుంచి వచ్చినవాళ్లే కాబట్టి వాళ్ల కష్టనష్టాలను కిషోర్ ఈ సినిమా ద్వారా చక్కగా చూపించాడని అన్నారు. కొన్ని సినిమాలోని పాత్రలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తొస్తుంటాయని అలాంటి సినిమా శ్రీకారం అని అన్నారు. నేను డైరెక్టర్ కాకముందు నుంచి నిర్మాతలు రామ్గారు, గోపీగారు తెలుసని ఈ సినిమా కోసం నలబై ఎకరాల్లో తిరుపతి దగ్గరున్న వ్యవసాయ భూమి తీసుకుని వ్యవసాయం చేసి నిజంగానే పంటలు పండించారని ఇది చూస్తుంటే సినిమాపై నిర్మాతల ప్యాషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. వాళ్లు ఇంకా చాలా మంచి సినిమాలెన్నింటినో నిర్మించాలని కోరుకున్నారు. ప్రేక్షకుల సపోర్ట్తో ఈ సినిమా ఇంకా పెద్ద రేంజ్కు వెళ్లాలని అన్నారు.
