ఏ హీరో చేయని విధంగా చేస్తున్న సందీప్ కిషన్

ఈమధ్య కాలంలో సినిమా పట్ల హీరోల బాధ్యత బాగా పెరిగింది. చిత్రీకరణలో పాల్గొనడమే కాదు సినిమా ప్రమోషన్లలో కూడా చెమటోడ్చాల్సి వస్తోంది. డిజిటల్, ప్రింట్ మీడియా ప్రమోషన్లే కాకుండా నేరుగా జనం మధ్యకు వెళ్లి ప్రమోషన్స్ చేయడం తప్పనిసరైంది. ఇక తాను నటించిన సినిమాకి హీరోనే నిర్మాత అయితే.. ఆ భాద్యత రెట్టింపవుతుంది. ప్రస్తుతం హీరో సందీప్ కిషన్ అదే పరిస్థితిలో ఉన్నారు.

ఆయన నటించి, నిర్మించిన కొత్త చిత్రం ‘నిను వీడని నీడను నేను’ కొద్దిరోజుల క్రితమే విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు మెల్లగా పుంజుకుని స్టడీగా రన్ అవుతున్నాయి. వెంటనే సందీప్ కిషన్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. మొదట థియేటర్ కవరేజ్ చేశారు. ఆ తర్వాత గుంటూరు, విజయవాడలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థుల్ని కలిశారు. జంగారెడ్డి గూడెంలో ప్రెస్ మీట్ పెట్టి అభిమానుల్ని నేరుగా కలిశారు. భీమవరంలో థియేటర్ కవరేజ్ చేశారు.

ఇక వైజాగ్ బీచ్ రోడ్ మీద సైకిల్ తొక్కుతూ చేయి ఊపిన ప్రతి అభిమాని దగ్గరికి వెళ్లి పలకరించి సెల్ఫీ ఇచ్చారు. కాకినాడ సుబ్బయ్య హోటల్లో సామాన్యుడిలా అందరితో కలిసి భోజనం చేశాడు. ఇవి కూడా చాలవన్నట్టు కాకినాడ లక్ష్మీ థియేటర్లలో స్వయంగా టికెట్ కౌంటర్లో కూర్చొని టికెట్స్ విక్రయించాడు. ఇలాంటి వేరైతే ఐడియాస్ ఆయన వద్ద ఇంకా ఉన్నాయట. మొత్తానికి సందీప్ కిషన్ ప్రమోషన్లంటేనే కొత్త అర్థం చెప్పేశారు.

Exit mobile version