కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూతపడ్డ సినిమా థియేటర్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. గత నెలలో లాక్డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేసిన తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెర్చుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. అయితే కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్న క్రమంలో అసలు ఇప్పుడు థియేటర్లను తెరిచినా ప్రేక్షకులు వస్తారా అని భయపడుతున్న ఎగ్జిబిటర్లు హాళ్లను తెరవాలా, వద్దా అన్న విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొత్త సినిమాలను ఓటీటీలకు ఇవ్వడం ఆపాలని నిర్మాతలను కోరుతూనే, మరో పక్క కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు లాంటి డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచుతున్నారు. వీటిపై వచ్చే స్పష్టతను బట్టి థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్లు వేచి చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అన్ని సానుకూలంగా అనిపిస్తే ఈ నెల 23 శుక్రవారం రోజున సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిటర్లు ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మరీ ఈ ముహుర్తానికైనా సినిమా థియేటర్లు తెరుచుకుంటాయా లేదా అనేది చూడాలి మరీ.
