‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’ లాంటి రెండు వరుస ఫ్లాపుల తర్వాత కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనలో ఉన్న రజనీ, ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఆగష్టు ఒకటిన ఈ సినిమా సెట్స్పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామ విద్యా బాలన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లేదనే ప్రచారం జరిగినా అందులో నిజం లేదని సమాచారం. ఇక రజనీ కాంత్ దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా ఇలా వరుసగా బాలీవుడ్ భామలతో జత కట్టడం విశేషంగా కనిపిస్తోంది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ తన వయసుకు సరిపోయే తరహా పాత్రను చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ వయసైన గ్యాంగ్స్టర్గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారట.
