
తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ప్రధాన భాషల్లోనూ హీరోయిన్గా సూపర్ స్టార్డమ్ను సొంతం చేసుకున్న నటి త్రిష, తాజాగా ‘నాయకి’ పేరుతో ఓ హర్రర్ కామెడీ ద్వారా మెప్పించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు గోవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే చెన్నై, హైద్రాబాద్లలో రెండు కీలక షెడ్యూల్స్ను పూర్తి చేసుకున్న టీమ్, నిన్ననే మూడో షెడ్యూల్ను మొదలుపెట్టింది.
ఈ షెడ్యూల్లో త్రిష, హీరో గణేష్ వెంకట్రామన్ల నేపథ్యంలో కొన్ని కామెడీ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదే షెడ్యూల్లో మరో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా జాయిన్ అయ్యారు. పూనమ్ కౌర్, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇప్పటివరకూ జరిగిన షెడ్యూల్స్తో టీమ్ అంతా ఎగ్జైటింగ్గా ఉందని దర్శకుడు గోవి ఈ సందర్భంగా తెలిపారు. గిరిధర్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ పోస్టర్కు ఇండస్ట్రీ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై ఇప్పట్నుంచే మంచి అంచనాలు బయలుదేరాయి.