
సినిమాల్లో హీరోగా మంచి స్టార్డమ్ సంపాదించుకున్న వారిలో చాలామంది తమను సంతృప్తి పరచే సినిమాలను తీసేందుకు నిర్మాతలుగా మారడం చూస్తూనే ఉన్నాం. అదే కోవలో భారీగా పెరిగిపోతోన్న బడ్జెట్ను కంట్రోల్లో పెట్టేందుకు తమ వంతుగా సినిమాలను కో ప్రొడ్యూస్ చేస్తున్న హీరోలను కూడా చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్లో ఎప్పుడో మొదలైన ఈ ట్రెండ్, ఈ మధ్యే తెలుగు, తమిళ సినిమాలకూ పాకింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ సైతం నిర్మాతగా రూపొందించిన శ్రీమంతుడు సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో కార్తి కూడా ఈ కోవలోనే అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. తనదైన యాక్టింగ్ స్టైల్తో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా మంచి స్టార్డమ్ సంపాదించుకున్న కార్తీ, ప్రిన్స్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ను లాంచ్ చేశారు. ఈ బ్యానర్పై కాష్మోరా పేరుతో మొదటి సినిమా చేయనున్నారు. గోకుల్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో శ్రీ దివ్య, నయనతార హీరోయిన్లుగా నటించనున్నారు. కార్తీ అన్న సూర్య కూడా ఈ మధ్యే 2D ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్తీ కూడా మరో నిర్మాణ సంస్థ మొదలుపెట్టడం విశేషంగా కనిపిస్తోంది.