‘ఆహుతి’ సినిమాతో తెలుగు సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు ఆహుతి ప్రసాద్. గత కొద్ది రోజులుగా కాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆహుతి ప్రసాద్ కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. ఆహుతి ప్రసాద్ గత కొన్ని రోజులుగా పురీషనాళ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కానీ కాన్సర్ చివరి స్టేజ్ లో ఉండడం వలన డాక్టర్స్ ఆయనని కాపదలేకపోవడంతో ఆయన హైదరాబాద్ కిమ్స్హాస్పిటల్ లో కన్నుమూశారు.
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు విజయవంతమైన సినిమాలలో నటించిన ఆయనకి చందమామ, సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాల్లో చేసిన కామెడీ స్టైల్ కి భారీ గుర్తింపు వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డ్ లభించింది. ఆహుతి ప్రసాద్ సినిపరిశ్రమలో సౌమ్యుడిగా, అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. ఆహుతి ప్రసాద్ కి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు అమెరికాలో సెటిల్ అయితే, రెండవ కుమారుడు సినీ పరిశ్రమలో నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన మరణం సినిపరిశ్రమకు తీరని లోటని సినిప్రముఖులు అంటున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటులలో ఒకరుగా చెప్పుకునే ఆహుతి ప్రసాద్ అకాల మరణానికి చింతిస్తూ, 123తెలుగు.కామ్ తరపున ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం..
