తెలుగు సినీ పరిశ్రమలో కొత్తదనమున్న కథలకు ఎప్పుడూ మంచి ఆదరణే దక్కుతుంది. గతంలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలు సాధించిన సినిమాలన్నీ ఆ కోవలో వచ్చినవే! తాజాగా ఆ కోవలోనే ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ‘దొంగాట’ నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి స్వయంగా నటించి, నిర్మించిన సినిమాయే ‘దొంగాట’. అడవి శేష్ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.
ఈ సినిమా విషయంలో సెకండాఫ్లోని కామెడీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మంచు లక్ష్మి ఒక స్టార్ హీరోయిన్ పాత్రలో కనిపించి బాగా ఆకట్టుకున్నారు. ఆమె యాక్టింగ్కు సినీ విశ్లేషకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇవన్నీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్గా నిలిస్తే.. నవదీ, సుశాంత్, రానా, నాని, రవితేజ, శింబు, నాగార్జున, మంచు మనోజ్ ఇలా ఇంతమంది హీరోలతో కలిసి చేసిన పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆ పాట చిత్రీకరణ కూడా చాలా రిచ్గా ఉండడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఏదేమైనా తెలుగు హీరోలు ఇలా ఒకే తెరపై కనిపించేందుకు సిద్ధమవ్వడం అభిమానులకు పండగే కదా!
