కర్ణాటక రాష్ట్రంలోని సినీ ప్రియులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సినిమా రంగం విషయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సినిమా రంగంపై తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్ ధరను రూ.200 గా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్ఫామ్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్లో ఒక ఫిల్మ్సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని నిర్మాణానికి రూ.500 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.4,08,647 కోట్ల బడ్జెట్ను సభ ముందుకు తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినిమా ప్రమోషన్స్, మహిళా సాధికారికత వంటి అంశాల గురించి ఈసారి బడ్జెట్లో కీలకంగా ప్రస్తావించారు. సినిమా టికెట్ రేట్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారు.
