
గత శుక్రవారం విడుదలైన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా సంతోషంగా ఉన్నాడు. విమర్శకుల ప్రసంశలతో పాటు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులతో కలసి తమ సంతోషాన్ని పంచుకోవడానికి, వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మూవీ యూనిట్ సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు.
గురువారం ‘పిల్లా నువ్వులేని జీవితం’ టీం తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ నగరాలలో పర్యటించనున్నారు. హీరో, హీరోయిన్ రెజినా ఇతర యూనిట్ సభ్యులు నేడు ఉదయమే హైదరాబాద్ నుండి పయనమయ్యారు.
త్వరలో విశాఖపట్టణంలో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. విడుదలకు ముందు హీరో ఆంధ్రాలో పర్యటించిన సంగతి తెలిసిందే. రవి కుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్ని వాసు, హర్షిత్ నిర్మించారు.

