‘టెంపర్’ విజయంతో జోష్ మీదున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ వెంటనే మరో మాస్ కమర్షియల్ సినిమా కాకుండా, తన స్టైల్లోనే జ్యోతిలక్ష్మీ పేరుతో డిఫరెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఛార్మీ హీరోయిన్గా జ్యోతిలక్ష్మీ పేరుతో ఓ సినిమా, ప్రముఖ నవలా రచయిత మల్లాది కృష్ణమూర్తి మిసెస్ పరాంకుశం ప్రేరణతో తెరకెక్కడం ఈ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
యూట్యూబ్లో దూసుకుపోతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుడిలో భారీ అంచనాలు ఉండగానే సినిమాను విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూరీ ఈ సినిమా రికార్డు టైమ్లో పూర్తి చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అదే స్పీడ్తో జరుగుతున్నట్టు తెలుస్తోంది. “పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తాం” అని ఈ సినిమాకు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ఛార్మీ తెలిపింది.