
ప్రముఖ నిర్మాత దిల్రాజు సినిమా అంటేనే సున్నితమైన భావోద్వేగాలకు పెట్టిన పేరు. ఎప్పటికప్పుడు సెన్సిబుల్ సినిమాలను నిర్మిస్తూ తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు దిల్రాజు. గత కొన్నాళ్ళుగా కేవలం పెద్ద సినిమాలు మాత్రమే చేస్తూ వెళ్ళిన ఆయన తాజాగా ‘వినాయకుడు’, ‘విలేజ్లో వినాయకుడు’ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ అడవితో ‘కేరింత’ పేరుతో ఓ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే!
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఈ వారమే (జూన్ 12న) విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ దినపత్రికతో ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు. కేరింత ఓ అందమైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని ఆయన తెలిపారు. ఇక తెలుగు సినిమా బడ్జెట్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటోందని, నిర్మాతలందరూ ఏకమైతేనే ఈ విషయంలో పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు. తెలుగులో కొందరు పెద్ద నిర్మాతల ఆధిపత్యం నడుస్తోందని, చిన్న సినిమాకు థియేటర్లు దొరకడం లేదనే ఓ ప్రశ్నకు, మంచి సినిమాను ఎవ్వరూ ఆపలేరని, బాగున్న సినిమాకు ప్రేక్షకులే బ్రహ్మరథం పడతారని సమాధానమిచ్చారు.

