
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా పరిచయమైన హీరో వరుణ్ తేజ్, విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో ‘కంచె’ పేరుతో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఆగష్టు 15వరకూ ఒక మోస్తారు అంచనాలతో కనిపించిన ఈ సినిమా, టీజర్ రిలీజ్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది.
ఒక్క చిన్న టీజర్తో అందరీ దృష్టినీ ఆకర్షించడమే కాక, ముందే సినిమాపై ఒక అవగాహన కలిపించడంలో ‘కంచె’ సూపర్ సక్సెస్ అయింది. టీజర్కు వచ్చిన రెస్పాన్స్ కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్లో ఉండడంతో సినిమా యూనిట్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇదే ఉత్సాహంతో దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ను కూడా ప్లాన్ చేశారు. హైద్రాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో డాల్బీ అట్మాస్ సిస్టమ్ ద్వారా కంచె ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ఇక అదేరోజు ఆన్లైన్లో కూడా ఈ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించారు.

