
వైవిధ్యభరితమైన కథాంశాలతో తెలుగు యువహీరోల్లో తనదంటూ ఒక మార్క్ సెట్ చేసుకుంటూ వెళుతోన్న సందీప్ కిషన్, తాజాగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే ఆసక్తికర టైటిల్తో ఓ సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమా టీ. రాజసింహ దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్, చోటా కె నాయుడు, అనల్ అరసు ఇలా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమాలో విలన్గా ప్రముఖ భోజ్పురి సినిమా నటుడు రవి కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించనున్నారనే విషయంపై ఆసక్తికర కథనం ప్రచారంలోకి వచ్చింది. ఒక్క అమ్మాయి తప్ప సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా నిత్యామీనన్ సంప్రదించినట్లు తెలుస్తోంది. నిత్యా మీనన్ కూడా కథ నచ్చడంతో సినిమాను ఓకే చేశారని సమాచారం. త్వరలోనే ఈ విషయమై ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక సందీప్ కిషన్-నిత్యా మీనన్ల ఫ్రెష్ జోడీ తెరపైకి రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.

