అప్పటి వరకు ఒక లెవల్లో ఉన్న తెలుగు సినిమా వేగం 1983 అక్టోబర్ 28వ తారీఖు తర్వాత అనూహ్యంగా పెరిగిపోయింది. అందుకు కారణం ఆరోజు విడుదలైన చిరంజీవి ‘ఖైదీ’. సాధారణ సినిమాగా విడుదలై అసాధారణ విజయాన్ని సాధించి తెలుగు పరిశ్రమ గతినే పూర్తిగా మార్చేసిన చిత్రం ఇది. అప్పటి వరకు ఒకే తరహా సినిమాలు చూసి చూసి నీరసించిపోయిన తెలుగు ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని రీతిలో స్పీడ్, రియలిస్టిక్ ఫైట్స్, ఉర్రూతలూగించే డ్యాన్సులు రుచి చూపించి జవసత్వాలు అందించిందీ సినిమా.
తెలుగు సినిమా అసలు కమర్షియల్ జర్నీ మొదలైంది కూడా ఈ చిత్రంతోనే. ఈ ఫార్ములాను పట్టుకునే ఇండస్ట్రీ కమర్షియల్ ఫార్మాట్ అనే కొత్త దారిని వెతుక్కుంది. అసలు ఈ సినిమా కథను పరుచూరి బ్రదర్స్ మాటలతో సహా కేవలం 3 రోజుల్లో పూర్తిచేయడం విశేషం. ఈ చిత్రంలో క్లాసిక్ అని చెప్పుకోదగిన సీన్ పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్. చిరు పోలీసుల్ని మెరుపు వేగంతో కొడుతుంటే తామే కొట్టినంత భావోద్వేగానికి గురయ్యేవాళ్ళమని అంటుంటారు అప్పటి ప్రేక్షకులు. ఇప్పటికీ ఈ సన్నివేశాన్ని ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడం కోసం వాడేస్తుంటారు చాలా మంది.
ఈ సినిమా ఇంత గొప్పగా మారడానికి కథా రచయితలు పరుచూరి బ్రదర్స్, దర్శకుడు కోదండరామిరెడ్డి ఎంత కారకులో కథానాయకుడు చిరంజీవి కూడా అంతే కారకుడు. ఈ సినిమా విడుదలయ్యే నాటికి ఎన్టీఆర్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నటుడి కోసం తెలుగు జనం ఎదురుచూస్తున్న తరుణంలో ‘ఖైదీ’తో అది నేనే అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడు చిరంజీవి.
అతి తక్కువ వ్యయంతో రూపొందిన సినిమా రూ.4 కోట్ల రూపాయలు రాబట్టడం చూసిన ప్రతిఒక్కరికీ ఇకపై నెంబర్ వన్ చిరంజీవే అనే సంగతి అర్థమైంది.
అప్పటికే చిరు 55కు పైగానే సినిమాలు చేసినా స్టార్ హీరోగా ఆయన జర్నీ మొదలైంది మాత్రం ‘ఖైదీ’తోనే. అప్పుడు మొదలైన ఆయన సరికొత్త ప్రస్థానం 36 ఏళ్లు గడిచినా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అందుకు సాక్ష్యమే నిన్న మొన్నటి ‘ఖైదీ నెం.150, సైరా’ చిత్రాల రికార్డ్ కలెక్షన్లు. ఈ సినిమా వేసిన పునాదుల మీదే మెగాస్టార్ అనే మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు చిరు.
అందుకే ‘ఖైదీ’ చిత్రమంటే చిరుకు అయన అభిమానులకు మాత్రమే కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఎంతో ప్రత్యేకం.


