కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండు నెలల పాటు పూర్తిగా లాక్డౌన్ పాటిస్తుండడంతో దీని ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. అయితే సినిమా షూటింగ్లు, రిలీజ్లు ఆగిపోవడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలయ్యింది. లాక్డౌన్ 4.0 లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నింటికి సడలింపులు ఇచ్చినా షూటింగ్లకు, సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్స్లకు మాత్రం ఇంకా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.
దీంతో తమకు అనుమతులిస్తే అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు తాము పాటించబోతున్న విధి, విధానాలను మరియు తీసుకోబోతున్న జాగ్రత్తలకు సంబంధించిన ప్లాన్ను సిద్దం చేసి పంపించింది.