పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’. చాన్నాళ్ల తర్వాత పవన్ ను స్క్రీన్ మీద చూడబోతుండటంతో అభిమానుల్లో మంచి ఉత్సుకత నెలకొంది. సినిమా రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకానుంది. అయితే టీమ్ ఇప్పటివరకు భారీ ప్రమోషన్స్ ఏవీ చేపట్టలేదు. టీజర్, పాటలు మినహా ఎలాంటి కార్యక్రమాలు లేవని ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.
అయితే ఈ ఆలస్యం వెనుక పెద్ద ప్లానింగ్ ఉందట. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారట నిర్మాత దిల్ రాజు. ఏప్రిల్ 3వ తేదీన ఈ ఈవెంట్ జరగవచ్చని తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా అంజలి, నివేతా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు చేశారు.


