దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్గా నటించిన చిత్రం ‘ఫ్రై డే’. ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈశ్వర్ బాబు ధూళిపూడి తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ‘ఫ్రై డే’ నుంచి వచ్చిన పోస్టర్లు సినిమా మీద అంచనాల్ని పెంచేసాయి. తాజాగా మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్రయూనిట్ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి చెప్పేలా ఎంతో అందంగా పాటను చిత్రీకరించారని ప్రశంసించారు. చిత్రయూనిట్ కు ఆమె ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ పాటను స్నిగ్ద నయని ఆలపించారు. మధు కిరణ్ సాహిత్యం ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలించేలా ఉంది. ప్రజ్వల్ క్రిష్ బాణీ ప్రతీ ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట మదర్స్ డే స్పెషల్గా నెట్టింట్లో వైరల్ అయ్యేలా ఉంది.
సాంగ్ లాంచ్ అనంతరం నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘డైరెక్టర్ ఈశ్వర్ బాబు వల్లే ఈ ‘ఫ్రై డే’ చిత్రాన్ని నిర్మించాను. ఆయన చెప్పిన కథ నాకు చాలా కనెక్ట్ అయింది. నేను ఎదిగి ప్రయోజకుడ్ని అయ్యే టైంకి మా అమ్మ గారు చనిపోయారు. నా ఎదుగుదలను మా అమ్మ చూడలేదు. ఇక ఈశ్వర్ చెప్పిన కథ నా మనసుకు తాకింది. మదర్స్ డే సందర్భంగా అమ్మ పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
డైరెక్టర్ ఈశ్వర్ బాబు మాట్లాడుతూ .. ‘‘ఫ్రై డే’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. పహల్గాం అటాక్ తరువాత నా మనసు కదిలిపోయింది. నాకు సామాజిక బాధ్యత ఉంది. గతంలో నేను గాడ్సే మీద సినిమా తీశాను. సోషల్ మీడియా వాడకం వల్ల ఇప్పుడు గాడ్సే గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఈ ‘ఫ్రై డే’ చిత్రంలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా ‘అమ్మ’ పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాను చూసిన తరువాత ప్రతీ తల్లి తన కొడుకుని ఓ ఛత్రపతి శివాజీలా, మహారాణా ప్రతాప్ సింగ్లా పెంచుతారు. పోరాడే శక్తిని అమ్మ మాత్రమే ఇస్తుంది’ అని అన్నారు.


