తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ వివాదాల కారణంగా చిక్కుల్లో పడింది. ఈ కేసుపై మంగళవారం మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగినప్పటికీ, కోర్టు తీర్పును తేదీ ప్రకటించకుండా రిజర్వ్లో ఉంచింది. దీంతో ఈ సినిమా విడుదల తేదీ ఖరారవుతుందని ఆశించిన అభిమానులకు, నిర్మాతలకు నిరాశే ఎదురైంది.
కోర్టులో వాదనల సందర్భంగా, సెన్సార్ బోర్డు (CBFC) కీలక పత్రాలను దాచిపెడుతోందని నిర్మాత తరపు న్యాయవాది ఆరోపించారు. అయితే, సినిమాను ఇప్పటికే రివిజన్ కమిటీకి పంపామని బోర్డు వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.
ఈ వివాదంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో, చిత్ర యూనిట్ ఇప్పుడు పూర్తిగా మద్రాస్ హైకోర్టు తీర్పుపైనే ఆధారపడాల్సి వచ్చింది. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ‘జన నాయగన్’ విడుదలపై నెలకొన్న సందిగ్ధత కొనసాగనుంది.


