బలమైన కంటెంట్‌తో వస్తున్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – వడ్డే నవీన్

బలమైన కంటెంట్‌తో వస్తున్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – వడ్డే నవీన్

Published on May 21, 2026 5:17 PM IST

వడ్డే నవీన్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన సినిమా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. వడ్డే జిష్ణు సమర్పణలో ‘వడ్డే క్రియేషన్స్’ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వడ్డే నవీన్‌తో పాటు రాశి సింగ్, శిల్పా తులస్కర్, రఘుబాబు, శివన్నారాయణ, బాబా బాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ తాజాగా నిర్వహించిన ఒక వేడుకలో ఈ మూవీ టీజర్‌ను గురువారం నాడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో, నిర్మాత వడ్డే నవీన్ మాట్లాడుతూ.. ‘మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చేస్తున్న మొదటి సినిమా ఇది. కథలు నచ్చకపోవడం వల్లే సినిమాలకు పదేళ్లు బ్రేక్ వచ్చింది. దర్శకుడు కమల్ చెప్పిన లైన్ నచ్చడంతో, ఏడాది పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేసి కొత్త కంటెంట్‌తో, హై క్వాలిటీతో ఈ చిత్రాన్ని తీశాం. రాశి సింగ్ అద్భుతంగా నటించింది. నేను ఇన్నాళ్లూ బయట కనిపించకపోయినా నన్ను గుర్తుపెట్టుకున్న అభిమానులకు, మీడియాకు థాంక్స్. జూన్ 19న రాబోతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు.

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నాకు లక్ష్మి అనే మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు థాంక్స్. నేను పనిచేసిన వాటిలో ఇదే బెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ. హీరో, నిర్మాత అయిన వడ్డే నవీన్ గారు ఎంతో మంచి వ్యక్తి, చాలా సింపుల్‌గా ఉంటారు. ఈ సినిమాతో ఆయన కమ్‌బ్యాక్ చాలా గట్టిగా ఉండబోతోంది. జూన్ 19న విడుదలవుతున్న మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని పేర్కొంది.

దర్శకుడు కమల్ తేజ నార్ల మాట్లాడుతూ.. ‘మా సినిమాకు మొదటి నుంచి మీడియా బాగా సపోర్ట్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం. పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుండి ఇలాంటి ఒక క్షణం కోసమే ఎదురుచూశాను. వడ్డే నవీన్ గారి లాంటి మంచి వ్యక్తితో నా మొదటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ కోరుకున్నట్లే ఆయన కమ్‌బ్యాక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. జూన్ 19న రిలీజ్ కాబోతున్న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని తెలిపారు.

నటుడు వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘వడ్డే నవీన్ గారు చాలా మంచి మనిషి. పదేళ్లు గ్యాప్ వచ్చినా ఆయనలో ఎలాంటి మార్పు లేదు, ఒకప్పటిలానే ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను. నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన నవీన్ గారికి థాంక్స్. జూన్ 19న విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

నటుడు సాయి కిరణ్ మాట్లాడుతూ.. ‘వడ్డే నవీన్ గారి కమ్‌బ్యాక్ మూవీ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’లో నటించడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నవీన్ గారి పాత పాటల్ని, సినిమాల్ని ఇప్పటికీ జనాలు చూస్తూనే ఉన్నారు. జూన్ 19న రాబోతున్న మా సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ రామ్ సుంకర, సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్, ఎడిటర్ విజయ్ ముక్తవరపు, కెమెరామెన్ కార్తీక్ సుజాత సాయికుమార్, ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

తాజా వార్తలు