టాలీవుడ్ కమెడియన్ ఫిష్ వెంకట్ జగన్ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై వైసీపీ కార్యకర్తలు కూడా ఆరా తీయగా.. విషయం తెలుసుకున్న ఫిష్ వెంకట్ స్పందించి.. తన పేరుతో ఎవరో తప్పుడు ట్వీట్లు చేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ కూడా చేశారు. ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు సోషల్ మీడియా అకౌంట్ లే లేవు. పైగా నాకు ట్వీట్ చేయటం రాదు. నా పేరు మీద తప్పుడు ట్వీట్ లు చేసి ఎవరినీ మోసం చేయకండి’ అంటూ వెంకట్ చెప్పుకొచ్చారు. అయినా తనకు సీఎం జగన్ అంటే ఎంతో అభిమానం అని, అనవసరంగా నన్ను వివాదాల్లోకి లాగకండి’ అని అన్నారు.
కాగా ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈయన, మొదట్లో ముషీరాబాద్ లోని కూరగాయల మార్కెట్ లో చేపలు అమ్ముకునేవాడు. దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. ఇక వెంకట్ ను దర్శకుడు వి.వి.వినాయక్ తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. ఎక్కువగా తెలంగాణా మాండలికము మాట్లాడే వెంకట్ ‘ఆది’ సినిమా ద్వారా ప్రజాధరణ పొంది సుమారు ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించాడు.