
అరవింద్ స్వామి.. 1990వ దశకంలో తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్తో దూసుకుపోయిన హీరో. దేశంలోని ప్రఖ్యాత దర్శకుల్లో ఒకరైన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యాల్లాంటి సినిమాలైన ‘బొంబాయ్’, ‘రోజా’, ‘దళపతి’ సినిమాల్లో నటించి నటుడిగా అద్భుతమైన పేరును గడించడమే కాక, అమ్మాయిలకు అప్పట్లో కలల రాకుమారుడిగా నిలిచారు. ఇక కొన్నాళ్ళ తర్వాత నటనను పక్కనబెట్టి కనిపించకుండా పోయిన ఆయన, ఈ మధ్యే మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన ‘కడలి’తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా అనుకున్నంత ఆడలేదు.
కాగా తాజాగా అరవింద్ స్వామి నటించిన తని ఒరువన్ అనే సినిమా తమిళ నాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని దూసుకుపోతోంది. జయం రవి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అరవింద స్వామి విలన్ పాత్రలో నటించారు. గతంలో సూపర్ సాఫ్ట్ హీరో క్యారెక్టర్స్ చేసిన అరవింద్, నెగటివ్ రోల్ పరంగానూ అదరగొట్టారనే టాక్ వినబడుతోంది. తమిళ నాట సూపర్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సినిమా, కలెక్షన్ల పరంగానూ అదే స్థాయి జోరు ప్రదర్శిస్తోంది. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు. ఇక ఈ సినిమాతో అరవింద్ స్వామికి మళ్ళీ ఓ స్ట్రాంగ్ కమ్బ్యాక్ లభించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.