మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో కొంత వరకు చిత్రీకరణ జరిపిన చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్ళింది. రామ్ చరణ్, కైరా అద్వానీ ఈ షూట్లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ కోసం చరణ్ ఈ నెల 25వ తేదీ వరకు బ్యాంకాక్ లోనే ఉండబోతున్నారు.
రామ్ చరణ్ తాజా చిత్రం ‘రంగస్థలం’ రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడం, తొలిసారి బోయపాటి చరణ్ ను డైరెక్ట్ చేయనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే ‘భరత్ అనే నేను’ లాంటి హిట్ సినిమాను అందించిన నిర్మాత డివివి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


