టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ నిర్మాతగా మారుతున్నారు. అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఆయన ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటుచేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయన దీనిని ప్రారంభించారు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నిర్మాణాలు ప్రారంభించాలన్నది ఈ సంస్థ సంకల్పం. మణికొండలోని తన నివాసానికి దగ్గరగా ఈ సంస్థ కార్యాలయం ఉంటుంది. వెబ్ సిరీస్, టీవీ షోలు, డైలీ సీరియల్స్, వాణిజ్య చిత్రాలు రూపొందించే పనిలో ఉన్నారు.
అలీకి పరిశ్రమలో మంచి మిత్రులు అయిన ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ,నిర్మాత అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ప్రొడ్యూసర్ జయచంద్ర, అలీ బ్రదర్ ఖయ్యూం, హీరో రవివర్మ ఇతర సినిమా ప్రముఖులు విచ్చేసి లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా.అలీ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో వెబ్ సీరీస్కు మంచి ఆదరణ లభిస్తుందని, నష్టాలు లేకుండా నిర్మాతలకు అదాయం లభించే అవకాశం మా అలీవుడ్ సంస్థ కల్పిస్తుందన్నారు. 24 క్రాఫ్ట్లకు సంబంధించిన సేవలను తమ సంస్థలో కల్పిస్తున్నామని, తాను తీయబోయే వెబ్ సిరీస్, టీవీ షోలను అభిమానులు ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు.


