తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రంగా వస్తున్న ‘జననాయగన్’ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ సినిమా, సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల విడుదలకు నోచుకోక అగమ్యగోచరంగా మారింది. అటు కోర్టుల నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్ రాకపోవడంతో, సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన దర్శకనిర్మాతలు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు.
ముఖ్యంగా దర్శకుడు హెచ్. వినోద్ ఈ ప్రాజెక్ట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సినిమాలో మతపరమైన సున్నిత అంశాలు ఉన్నాయని, ఆర్మీని అవమానించేలా సంభాషణలు ఉన్నాయని సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడం సినిమా విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారింది. గతంలో ఇతర సినిమాలకు అండగా నిలిచిన సినీ పెద్దలు, విమర్శకులు కూడా ఈ విషయంలో సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం వినోద్ను మరింత ఆవేదనకు గురిచేస్తోంది.
విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు వస్తున్న చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల పర్వంతో సతమతమవుతోంది. ప్రస్తుతం ఏప్రిల్ 30న విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.


