తన మొదటి చిత్రంతోనే అద్భుతం అనిపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. “అ!” అనే తన మొదటి చిత్రంతో మన టాలీవుడ్ ఆడియన్స్ ను ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను అందించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుని ప్రతిభకు జాతీయ పురస్కారం కూడా వరించింది. ఆ తర్వాత “కల్కి” చిత్రంతో కూడా మంచి మార్కులు అందుకున్నారు.
తర్వాత ఈ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ లేటెస్ట్ గా “జాంబీ రెడ్డి” అనే ఓ సరికొత్త చిత్రంతో ఒక్కసారిగా మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి ట్రెండ్ అయిన ఈ దర్శకునికి ప్రశంసల జల్లు కురిసింది. కానీ ఓ సామాజిక వర్గం నుంచి మాత్రం అసంతృప్తి సెగ తగిలింది. దీనితో దర్శకుడు ఈ అంశం పై ఒక ఫైనల్ క్లారిటీను ఇచ్చారు.
“ఇటీవల మా సినిమా టైటిల్ ‘జాంబీ రెడ్డి’ అని ప్రకటించాం. దానికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా కాల్స్, మెసేజ్స్ తో పాటు మీమ్స్ కూడా వచ్చాయని, సినిమాకు అది యాప్ట్ టైటిల్. యానిమేషన్ చాలా బాగుందంటున్నారు. దానిపై మూడు నెలలకు పైగానే వర్క్ చేశాం. టీమ్ పడిన కష్టానికి వచ్చిన రిజల్ట్తో మేమంతా హ్యాపీగా ఉన్నామని తెలిపారు.
కొంతమంది మాత్రం టైటిల్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమాలో ఎవరినీ తక్కువ చేసి చూపించడం, ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని తక్కువ చేసి చూపించడం ఉండదు. ఇదొక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ప్రస్తుతం మనం చూస్తున్న కరోనా మహమ్మారి చుట్టూ జరిగే, కర్నూలు బ్యాక్డ్రాప్లో జరిగే కథ. హాలీవుడ్లో ఈ రకం ఎపిడెమిక్ ఫిలిమ్స్ చూస్తుంటాం. అక్కడ న్యూయార్క్ లాంటి బ్యాక్డ్రాప్లో ఆ కథ జరిగినట్లు చూపిస్తుంటారు.
కానీ నేను కర్నూలును బ్యాక్డ్రాప్గా ఎంచుకున్నాను. కర్నూలులో ఇలాంటి మహమ్మారి తలెత్తితే, అక్కడి ప్రజలు ఎలా ఫైట్ చేసి, ఈ మహమ్మారిని నిరోధించి, ప్రపంచాన్నంతా కాపాడతారన్నది ఇందులోని ప్రధానాంశం. కర్నూలును కథ ఎంత హైలైట్ చేస్తుందో సినిమా చూస్తే తెలుస్తుంది. దయచేసి టైటిల్ను తప్పుగా ఊహించుకోవద్దు. ఏ కులాన్నీ తక్కువచేసి చూపించడం అనేది కచ్చితంగా ఈ సినిమాలో ఉండదు. నా ఫస్ట్ ఫిల్మ్ ‘అ!’కు జాతీయ స్థాయి గుర్తింపు వస్తే, ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను. అందరూ గర్వంగా ఫీలవుతారు.” అని ఒక క్లారిటీ ఇచ్చారు.