సైరా నరసింహారెడ్డి విడుదలకు రెండు వారాల సమయం కూడా లేదు. వచ్చే నెల 2న విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ సందర్బంగా ఈనెల 18న చిత్ర ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఐతే ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డిని ఓ పాత్రికేయుడు సైరా క్లైమాక్స్ లో చిరంజీవి మరణిస్తారు, కాబట్టి ఇలాంటి ట్రాజెడీ ఎండింగ్స్ తెలుగు ప్రజలు ఇష్టపడరు కదా అని అడుగగా…, ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
ఒక బయోపిక్ తీస్తున్నప్పుడు చరిత్రని మార్చితీయలేం. సైరా లో చిరంజీవి పాత్ర చనిపోవడం విషాదం కాదు, అది విజయానికి నిదర్శనం. ఆయన మరణిస్తూ అనేక మంది భారతీయులలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించి పోయారు. నరసింహారెడ్డి తలని ముప్పై ఏళ్లకు పైగా బ్రిటిష్ వారి కోట గుమ్మానికి వేలాడదీసి ఉంచారంటేనే అర్థం అవుతుంది, ఆయన వారిని ఎంతగా భయపెట్టారో. కాబట్టి సైరాలో క్లైమాక్స్ విషాదాంతం అనడానికి వీలులేదు అన్నారు.
కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటిస్తుండగా…,అమితాబ్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది.
