ముఖ్య అంశాలు
- హైదరాబాద్లోని బోల్డర్ హిల్స్లో శనివారం (జూన్ 13) జరగాల్సిన థమన్ ‘ఓజీ టూర్ ఇండియా’ ఈవెంట్ రద్దయింది.
- నగరంలో కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా కాన్సర్ట్ కోసం వేసిన భారీ స్టేజ్ దెబ్బతింది.
- ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేశారు.
పవర్ స్టార్ అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజీ’ (OG) టూర్ ఇండియా హైదరాబాద్ కాన్సర్ట్కు వరుణుడు బ్రేక్ వేశాడు. థమన్ లైవ్ మ్యూజిక్ అదరగొడతాడని ఆశపడిన ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. శనివారం (జూన్ 13) సాయంత్రం హైదరాబాద్ నగరవ్యాప్తంగా అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, భీకరమైన ఈదురుగాలుల కారణంగా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా రద్దు చేశారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని నిర్వాహకులు వెల్లడించారు.
గచ్చిబౌలి సమీపంలోని బోల్డర్ హిల్స్ ఈ మెగా ఈవెంట్కు వేదికగా నిలిచింది.అయితే, సాయంత్రం సమయంలో వీచిన బలమైన గాలుల ధాటికి కాన్సర్ట్ కోసం ఏర్పాటు చేసిన భారీ సెటప్ తీవ్రంగా దెబ్బతింది. వందల అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లు, స్టేజ్ రిగ్గింగ్ సిస్టమ్ కుప్పకూలిపోయాయి. వేలాది మంది అభిమానులు వచ్చే కార్యక్రమం కావడంతో, ఎలాంటి ప్రమాదం జరగకముందే సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఈవెంట్ను క్యాన్సిల్ చేశారు.
ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ఈ ఈవెంట్ కోసం ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు చేసింది. పాసులు, టికెట్లు బుక్ చేసుకుని ఫుల్ జోష్లో ఉన్న అభిమానులు ఈ అనూహ్య పరిణామంతో వెనుదిరగాల్సి వచ్చింది. మళ్లీ ఈ కాన్సర్ట్ ఎప్పుడు ఉంటుందనే దానిపై నిర్వాహకుల నుంచి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.


