నేటి యువతకు అద్దం పట్టేలా ‘హుషారు పిట్టలు’.. టీజర్ రిలీజ్ చేసిన సురేష్‌బాబు

Husharu Pittalu

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు.

టీజర్ ఆవిష్కరణ అనంతరం సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని చూడగానే చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. నటీనటులంతా సహజంగా నటించారు. నేటి యువతకు కచ్చితంగా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది’’ అని ప్రశంసించారు. మరో అతిథి నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రథమార్ధం యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో సాగితే, ద్వితీయార్థంలో ఒక మెచ్యూర్డ్‌ పాయింట్‌ను దర్శకుడు చాలా బాధ్యతాయుతంగా చూపించారని, కంటెంట్ నచ్చడం వల్లే సురేష్‌బాబు, తాను ఈ సినిమాకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.

తన నిజ జీవితంలో చూసిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించానని, ఇది యువతతో పాటు తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా అని దర్శకుడు బిక్షు పేర్కొన్నారు. మంచి సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశామని నిర్మాత వెంకట్‌ యాదవ్‌ తెలిపారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి చరణ్‌-అర్జున్ సంగీతం అందించారు.

Exit mobile version