
ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా (అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం).. కొన్నేళ్ళ పాటుగా ఇండియన్ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాదీ వైభవంగా జరుగుతోన్న ఫిల్మ్ ఫెస్టివల్. కొన్నాళ్ళుగా హైద్రాబాద్ని శాశ్వత వేదికగా చేసుకొని అలరిస్తోన్న ఈ ఫెస్టివల్ ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో మొదలు కాబోతోంది. ప్రస్తుతం 19వ బాలల చిత్రోత్సవం జరగనుంది. బాలల దినోత్సవమైన నవంబర్ 14న మొదలుకానున్న ఈ ఫెస్టివల్ నవంబర్ 20 వరకూ జరగనుంది.
చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తైనట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 200 సినిమాలను మొత్తం 15 థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ప్రసాద్ ఐమాక్స్ను మేజర్ థియేటర్గా నిర్ణయించారు. ఇక్కడే పలు అంతర్జాతీయ సినీ పరిశ్రమలకు సంబంధించిన సినీ ప్రముఖులు, విదేశీయులు పాల్గొననున్నారు. ఇక చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ను అందరికీ చేర్చాలన్న ఉద్దేశంలో ఫెస్టివల్ నిర్వాహకులు హైద్రాబాద్ నిండా ఫెస్టివల్ సంబంధిత ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

