India vs Zimbabwe T20 World Cup 2026: ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌కు రెడీ అయిన టీమిండియా.. నెట్స్‌లో భారీ సిక్సర్లతో ప్రాక్టీస్!

India vs Zimbabwe T20 World Cup 2026

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు ఇప్పుడు అసలైన సవాల్ ఎదురైంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-8 లో భాగంగా గురువారం (ఫిబ్రవరి 26, 2026) చెన్నైలోని MA చిదంబరం (చెపాక్) స్టేడియంలో జింబాబ్వేతో (India vs Zimbabwe T20 World Cup 2026) చాలా ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత జట్టుకు, ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సిందే.

బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత ఆటగాళ్లు గట్టిగా చెమటోడ్చారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా సిక్సర్లు కొడుతూ నెట్స్‌లో ఫైర్‌వర్క్స్ (fireworks) సృష్టించారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కుర్రాడు తిలక్ వర్మతో పాటు వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపాడు. గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన బ్యాటింగ్ లైనప్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు కోచ్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్ల ఫామ్ ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం.

ఈ కీలక మ్యాచ్ కోసం తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచ్‌లలో డకౌట్ అవ్వడంతో, అతడి ప్లేస్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రత్యర్థి జట్లు ప్లాన్ చేసి మరీ ఆఫ్‌-స్పిన్ బౌలింగ్‌తో మన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను టార్గెట్ చేస్తుండటంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే తండ్రి అనారోగ్యంతో ఇంటికి వెళ్లిన రింకూ సింగ్ తిరిగి టీమ్‌తో చేరనున్నాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు కూడా మళ్లీ చోటు దక్కే అవకాశాలున్నాయి.

ఇక జింబాబ్వే జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి పెద్ద జట్లకు ఊహించని షాక్ ఇచ్చి వాళ్లు సూపర్-8 లోకి ఎంటరయ్యారు. వాళ్ల కెప్టెన్ సికందర్ రజా, స్టార్ బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్, అలాగే 11 వికెట్లు తీసిన పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని మంచి ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి మన బౌలర్లు వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇదిలా ఉంటే, మ్యాచ్ జరగబోయే చెన్నై స్టేడియంలో సందడి మామూలుగా లేదు. ఇక్కడకు వచ్చే ఫ్యాన్స్ కి ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు స్టేడియంలో ఒక స్పెషల్ మెడికల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. చెన్నై అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీనే. గ్రౌండ్ బయట ఎక్కడ చూసినా ధోనీ పోస్టర్లతో ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. నీటి ఎద్దడిని ఎదుర్కొన్న నగరం కావడంతో, స్టేడియంలో వాటర్ సేవ్ చేయాలనే మంచి సందేశాలు కూడా బోర్డుల మీద రాసి ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన గ్రౌండ్‌లో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version