ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన “కర్మణ్యే వాధికారస్తే” సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించగా, బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించగా, నిర్మాణ బాధ్యతలు డి.ఎస్.ఎస్. దుర్గాప్రసాద్ చేపట్టారు.
ఇటీవల మధుర ఆడియో ద్వారా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన పొందింది. ట్రెండింగ్లో నిలిచిన ఈ ట్రైలర్, సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. సినిమా యూనిట్ మాట్లాడుతూ, “కర్మణ్యే వాధికారస్తే అనేది భగవద్గీతలోని పదం. దీని అర్థం ‘పని చేసే హక్కు మనకుంది కానీ ఫలితాల మీద కాదు.’ టైటిల్కు తగ్గట్టే కథను కూడా చాలా ఉత్కంఠగా మలిచాం. ఇందులో బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్ అద్భుతమైన నటనతో సినిమాకు ప్రత్యేక శక్తి ఇచ్చారు” అన్నారు.
ఈ సినిమా ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందింది. విద్యార్థుల హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్లు వంటి రోజువారీ జీవితంలో మనం వార్తల్లో చూస్తున్న నిజ సంఘటనల ఆధారంగా కథను తయారు చేశామని సినిమా బృందం తెలిపింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సినీప్రియుల ముందుకు సెప్టెంబర్ 19న రానుంది
