
అక్కినేని వంశం నుంచి మూడో తరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అక్కినేని అఖిల్ మొదటి సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. అఖిల్ అనే పేరుతోనే తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అఖిల్ ఎంట్రీ సినిమా అంటూ మొదట్నుంచీ కనిపిస్తూ వచ్చిన క్రేజ్ను దృష్టిలో పెట్టుకొనే దర్శక నిర్మాతలు వీవీ వినాయక్, నితిన్లు భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించారు. పలు అద్భుతమైన లొకేషన్స్లో షూటింగ్ జరిపారు.
ఇక ఇదే కోవలో సినిమా ఆడియో రిలీజ్ను కూడా భారీ ఎత్తున చేపట్టేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ‘అఖిల్’ ఆడియో రిలీజ్ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అఖిల్ తన సినిమా ఆడియో రిలీజ్ దగ్గరపడుతోన్న నేపథ్యంలో ఎగ్జైటింగ్గా ఉన్నానని తెలిపారు. అయితే ఏఎన్నార్ ఈ సందర్భంగా మనతో లేకపోవడం బాధగా ఉందని అన్నారు. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను అక్టోబర్ 22న పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు.