సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. గ్లోబల్ స్థాయిలో భారీ అంచనాలున్న ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు, విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ ఇంటర్వ్యూలలో ఇస్తున్న సమాచారం అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మంచు కొండల్లో శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య వచ్చే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ను రాజమౌళి అక్కడ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని, ఇందుకోసం చిత్ర యూనిట్ ఎంతో శ్రమిస్తోందని తెలుస్తోంది.
షూటింగ్ ప్లానింగ్ విషయానికి వస్తే, జూన్ లేదా జూలై నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ గ్లోబల్ అడ్వెంచర్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.


