పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనతో అభిమానులను చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి జనసేన పేరుతో విరాళాలు సేకరిస్తున్న వ్యక్తులకు పవన్ చెక్ పెట్టడం, రెండు పార్టీ గుర్తింపు లభించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పడం.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ఎంటరయిన తర్వాత కొత్త సినిమా షూటింగులకు బ్రేక్ పడింది. ‘అత్తారింటికి దారేది’ విడుదలై 300 రోజులు దాటింది. ఇప్పటివరకు పవన్ మరో సినిమా షూటింగ్లో పాల్గొనలేదు. ‘గోపాల గోపాల’ షూటింగ్లో మరికొన్ని రోజులలో పాల్గొంటారు. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్-2’ ప్రారంభిస్తారు. దర్శకుడు సంపత్ నంది రెండేళ్ళ నుండి పవన్ కోసం వెయిట్ చేస్తున్నారు. జనసేన గుర్తింపు వచ్చేవరకు పవన్ సినిమాలపై దృష్టి పెడతారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఎన్నికలు పూర్తయిన తర్వాత హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో జనసేన పోటి చేస్తుందని ప్రకటించడంతో ఇక సినిమాలకు పవన్ త్వరలో ఫుల్ స్టాప్ పెట్టేస్తాడని అభిమానులు భావించారు. తమ ఫేవరెట్ హీరో వెండితెర విన్యాశాలు ‘గోపాల గోపాల’, ‘గబ్బర్ సింగ్-2’ సినిమాల తర్వాత చూసే అవకాశం ఉండదేమో అని నిరాశకు గురయ్యారు. తాజా ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు లభించేలోపు పవన్ ఆలోచనలో మార్పు వచ్చి కొత్త సినిమాలు అంగీకరిస్తాడని ఆశిస్తున్నారు.
‘అత్తారింటికి దారేది’ ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. అటువంటి సమయంలో రాజకీయాలలోకి వస్తున్నాను అని పవన్ చేసిన ప్రకటన కొందరికి సంతోషం కలిగించగా.. కొన్నాళ్ళ తర్వాత సినిమాలలో నటించడం మానేస్తాను అని చెప్పడం భాదించింది. జనసేన పార్టీ కార్యకలపాలను పూర్తిస్థాయిలో ప్రారంభించిన తర్వాత కూడా సినిమాలలో నటించడం కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక పవన్ మన్నిస్తాడో..? లేదో..?భవిష్యత్ నిర్ణయించాలి.


