పవన్, గద్దర్ రేర్ పిక్ వైరల్: ఎమోషనల్ పోస్ట్‌తో.. ఆ రోజు ఏం జరిగిందో స్వయంగా చెప్పిన జనసేనాని!

ముఖ్య అంశాలు

  • సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తన పాత ఫోటోపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
  • ప్రజారాజ్యం (PRP) పార్టీ స్థాపనకు ముందు, తన తండ్రి మరణించిన సమయంలో గద్దర్, అగస్టీన్ తన ఇంటికి వచ్చినప్పటి చిత్రమిదని ఆయన స్పష్టం చేశారు.
  • ఆ రోజుల్లోనే సామాజిక తెలంగాణ, బహుజన సాధికారత, రాజకీయ సమానత్వం లాంటి ఎన్నో కీలక అంశాలపై తమ మధ్య లోతైన చర్చలు జరిగాయని పవన్ గుర్తుచేసుకున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ఫోటో ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా పవన్ కల్యాణ్, ప్రజా గాయకుడు గద్దర్, బహుజన ఉద్యమకారుడు అగస్టీన్‌తో కలిసి ఉన్న ఒక పాత ఫోటో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు ఈ ఫోటో ఎప్పటిది? ఆ ముగ్గురు ఎక్కడ కలిశారు? అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్యూరియాసిటీని గమనించిన పవన్.. స్వయంగా ఆ ఫోటో వెనుక ఉన్న అసలు కథను అభిమానులతో పంచుకున్నారు.

ఆ చిత్రం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అపురూపమైన జ్ఞాపకమని పవన్ తెలిపారు. అది ప్రజారాజ్యం పార్టీ స్థాపించడానికి ముందు తీసిన ఫోటో అని క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు కన్నుమూసిన సమయంలో.. ఆయన్ని పరామర్శించడానికి గద్దర్, అగస్టీన్ తన ఇంటికి వచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆ విషాద సమయంలోనూ వారి మధ్య సమాజం గురించిన ఎన్నో లోతైన చర్చలు సాగాయని పవన్ వివరించారు.

“ఆ రోజుల్లో తెలంగాణ మేధావులు, గద్దర్, అగస్టీన్ లాంటి వారితో కలిసి తెలంగాణ భవిష్యత్తు గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా సామాజిక తెలంగాణ, బహుజన వర్గాల సాధికారత, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం ఎలా దక్కాలనే అంశాలపై మా మధ్య సుదీర్ఘ చర్చలు జరిగేవి. రాజకీయ అధికార పంపిణీలో సమానత్వం ఉండాలనేది ఆనాటి మా ప్రధాన ఎజెండా,” అని పవన్ కల్యాణ్ నాటి రోజులను స్మరించుకున్నారు.

రాజకీయాలకు అతీతంగా, సమాజంలో మార్పు రావాలి, అందరికీ సమాన హక్కులు దక్కాలి అనే ఒక గొప్ప సంకల్పంతో సాగిన ఆనాటి సంభాషణలు తన మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. కేవలం ఒక పరామర్శ కోసమే కలిసినా, ఆ కలయిక వెనుక ఇంత బలమైన సామాజిక ఆకాంక్ష ఉందన్న విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version