పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. లాక్ డౌన్ ముందు సైన్ చేసిన సినిమాలు లాక్ డౌన్ కారణంగా ఆగిపోవడం, అన్నీ ఒకేసారి చేయాల్సి రావడంతో ఆయన ఏమాత్రం ఖాళీగా లేరు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ ముగించిన ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ మూవీ చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమాతో పాటే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేయాల్సి ఉంది. రెండూ ఒకేసారి జరగనున్నాయి.
అందుకే పవన్ కంఫర్ట్ కోసం ఒకే చోట రెండు సినిమాలకు కావలసిన సెట్లు వేశారు. ఈ వరుస షెడ్యూళ్లతో పాటు పవన్ రాజకీయ పరమైన పనులు కూడ చూసుకుంటున్నారు. ఈరోజు పార్టీ పని మీద తిరుపతి వెళ్ళారు. ఒంగోలు పర్యటన కూడ పెట్టుకున్నారు. అది పూర్తైన వెంటనే మళ్ళీ క్రిష్ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఇలా ఎడతెరిపి లేకుండా పనిచేయడం వలన అలసిపోతున్న పవన్ క్రిష్ సినిమా షెడ్యూల్ పూర్తవగానే కాస్త బ్రేక్ తీసుకునే యోచనలో ఉన్నారట. ఆ తరవాత రీమేక్ సినిమాను కూడ మొదలుపెడతారు. మొత్తం మీద ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించే యోచనలో ఉన్నారు పవన్.