అమలాపురం : మే 13
భారతదేశంలో అత్యంత ఉత్తమ సేవాకార్యక్రమాలను , అత్యుత్తమ పారమార్ధిక కార్యక్రమాలను నిర్వహిస్తూ కోట్లాది భారతీయుల ఆదరణను అందుకుంటున్న రామకృష్ణ మఠం ఇప్పుడు కరోనావైరస్ సంక్షోభ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా చేస్తున్న నిస్వార్ధ సేవా కార్యక్రమాలు ఆశ్చర్యపరుస్తున్నాయ్. ఆకట్టుకుంటున్నాయ్. అభినందనలందుకుంటున్నాయ్.
ఉభయగోదావరి జిల్లాలలో అత్యంత ప్రతిష్టాకరమైన గౌరవప్రదమైన సేవా సంస్థగా అందరూ మెచ్చుకునే రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి వినిశ్చలానంద మహారాజ్ ఆధ్వర్యంలో ఈ ఉదయం వందలాది పేదలకు వోక్కక్కరికి ఇరవై ఐదు కిలోల బియ్యం, నెలకి సరిపడేలా సరుకుల కిట్ ను అందజేసే నిమిత్తం ఏర్పాటుచేసిన ‘ సహాయార్థులకు పదార్ధ సేవ ‘ కార్యక్రమంలో గౌరవ అతిధిగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
చాలాకాలం తరువాత రాజమహేంద్రవరంలో ఈ అద్భుత కార్యకమంలో పాల్గొన్న పురాణపండ శ్రీనివాస్ పై రామకృష్ణమఠ్, రామకృష్ణ మిషన్ సంస్థల సిబ్బంది , హాజరైన వందలాది ప్రేక్షకులు చూపించిన అభిమానం మరువలేనిదిగా వుంది. సహజంగా మీటింగ్స్ కి దూరంగా వుండే శ్రీనివాస్ రామకృష్ణమఠ్ పై గౌరవంతో హాజరయ్యానని పేర్కొన్నారు. స్వామిజీ వినిశ్చలానంద మహారాజ్ మరియు పురాణపండ శ్రీనివాస్ జ్యోతిప్రజ్వలన చేసి లాంఛనంగా ఈ సేవాకార్యానికి శ్రీకారం చుట్టారు.
ఉభయగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలలో సైతం పురాణపండ శ్రీనివాస్ మహా గ్రంథ సంపదకు వున్న ఆదరణ విశేషంగానే చెప్పాలి. బుక్స్ గెటప్ మరియు అందమైన భాషాసొగసులతో లక్షల పాఠకుల హృదయాలను కొల్లగొట్టిన పురాణపండ శ్రీనివాస్ ఈ నిర్మలమైన సేవాకార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్నిస్తోందని స్వామీజీ అనుగ్రహించారు . అనంతరం స్వామిజీ వినిశ్చలానంద మహారాజ్ పర్యవేక్షణలో జరిగిన ‘ సహాయార్థులకు పదార్ధ సేవ ‘ కార్యక్రమంలో పాల్గొన్న వందలకొలది పేదలకు పంచిన పదార్ధాల వితరణ కార్యక్రమంలో పలువురు డాక్టర్స్, పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సేవా కార్యక్రమాలలో ఇది చాలా ఉన్నతమైన, ఉత్తమమైన సేవా కార్యక్రమంగా పలువురు పేర్కొనడం గమనార్హం.