ముదిరిన టాలీవుడ్ పంచాయతీ.. ‘పెద్ది’కి రెడ్ అలెర్ట్..?

ముదిరిన టాలీవుడ్ పంచాయతీ.. ‘పెద్ది’కి రెడ్ అలెర్ట్..?

Published on May 15, 2026 12:01 AM IST

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా సాగుతున్న ‘పర్సెంటేజ్ వార్’ ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. కేవలం వ్యాపారపరమైన విభేదాలతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలను అడ్డుకునే స్థాయికి వెళ్లడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు ఏకమై, రాష్ట్రవ్యాప్తంగా ఒక్క స్క్రీన్‌లో కూడా ఈ సినిమాను ప్రదర్శించకూడదని తీసుకున్న నిర్ణయం ఒక భారీ బ్లాక్ బస్టర్‌ను ఆదిలోనే దెబ్బతీసేలా కనిపిస్తోంది.

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తమ డిమాండ్ల కోసం ఒక భారీ చిత్రాన్ని ఆయుధంగా వాడుకోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాతలతో సాగుతున్న ఈ పోరాటంలో అటు అభిమానులు, ఇటు చిత్ర బృందం బలిపశువు అవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నైజాం ప్రాంతంలో సినిమాను పూర్తిగా బహిష్కరించడం వల్ల కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా, మనుగడ కోసం పోరాడుతున్న థియేటర్లకు కూడా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

పరిశ్రమలోని పెద్దలు తమ పంతం కోసం ఒక సినిమా భవిష్యత్తును పణంగా పెట్టడం టాలీవుడ్‌కు గర్వకారణం కాదని నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. జూన్ 4 లోపు ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక పరిష్కారం లభించకపోతే, తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలి పోయే అవకాశం ఉంది. ఈ ఈగో ల పోరాటంలో చివరికి విజేతలెవరో కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు