
తెలుగు సినిమా హీరోల్లో చాలా కాలం నుంచీ ప్రత్యేక తరహా కథలను ఎంపిక చేసుకుంటూ పెద్ద హీరోల్లో తనకంటూ ఓ రూట్ సెట్ చేసుకున్నారు కింగ్ నాగార్జున. ‘మనం’ లాంటి హిట్ తర్వాత ఆయన హీరోగా చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత రాధా మోహన్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే అందించడం విశేషం.
ఇక దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత నాగార్జున, రమ్యకృష్ణలు మళ్ళీ ఈ సినిమా కోసం జత కట్టడం ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇక ఫ్రాన్స్లో నాగ్-కార్తీల సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ ఈ మధ్యే పూర్తవ్వగా, నాగార్జున ఆ షెడ్యూల్ను పూర్తి చేసి వెంటనే సోగ్గాడే చిన్ని నాయనా చివరి షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం నాగార్జున, యాంకర్ అనసూయ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి మరో హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారు.