అభిమానులకు సినిమా ద్వారా మరో ట్రీట్ ఇవ్వనున్న పవన్ !


పవన్ కళ్యాణ్ నటించే సినిమాల్లోని ప్రత్యేకతల్లో జానపద నైపథ్యంలో సాగే పాటలు కూడా ముఖ్యమైనవి. పవన్ నటించే ప్రతి సినిమాలో అలాంటి పాట ఒకటి ఖచ్చితంగా ఉండాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటుంటారు. గతంలో ఖుషిలో చేసిన ‘బంగారు రమణమ్మా’, తమ్ముడు చిత్రంలోని ‘మల్లి నీకెందురా పెళ్లి’, గబ్బర్ సింగ్ చిత్రంలో వచ్చిన ‘మందు బాబులం’, అత్తారింటికి దారేదిలో పవన్ స్వయంగా పాడిన ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా’ మొన్నీ మధ్య వచ్చిన కాటమరాయుడు చిత్రంలో చేసిన ‘జివ్వు జివ్వు’ పాటలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఈ సూపర్ హిట్ పాటలన్నీ ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే ఉంటాయి.

అందుకే ఈసారి త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో కూడా ఇలాంటి పాటే ఒకటి ఉండేలా పవన్ ప్లాన్ చేశారట. ఇది పూర్తిగా కామెడీ కలగలిసి ఉంటుందని, ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఈ పాటను పవన్ స్వయంగా పాడతారా లేకపోతే వేరే ఎవరితోనైనా పాడిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా మొదటి షెడ్యూల్ ను జరుపుకుంటున్న ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించనున్నారు.

Exit mobile version