అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన “పోలీస్ వారి హెచ్చరిక” చిత్ర టీజర్ను తన కార్యాలయంలో సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. కాగా నేడు నవ దళపతి సుధీర్ బాబు చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ విడుదల కావడం జరిగింది.
ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. “దర్శకుడు బాబ్జీ మా మామగారైన సూపర్ స్టార్ కృష్ణ గారికి బాగా దగ్గరివాడు. దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ గారి అభిమానులందరికీ సుపరిచితుడు. అటువంటి బాబ్జీ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్ను నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. టీజర్ అంటే రకరకాల వ్యాపకాలతో, రకరకాల మూడ్స్ తో ఉండే ప్రేక్షకులను చిటికవేసి మనవైపుకు తిప్పుకునే అస్త్రం. “పోలీస్ వారి హెచ్చరిక” అలా ఒక అస్త్రంలా ఆకర్షణీయంగా, రిచ్ గా ఉంది” అని అన్నారు.
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. “నేను ఏ సినిమా చేసినా ఆ సినిమా తాలూకు ఏదో ఒక కార్యక్రమాన్ని కృష్ణ గారి చేతుల మీదుగా జరుపుకునే వాడిని. ప్రస్తుతం కృష్ణ గారు భౌతికంగా మన మధ్య లేకపోవడంతో ఈ సినిమాకు సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేతుల మీదుగా జరుపుకోలేకపోయాననే లోటు ఇలా సుధీర్ బాబు గారు ఈ టీజర్ ను విడుదల చేయడంతో తీరింది” అని అన్నారు.
నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ.. “ఒక కొత్త నిర్మాతగా నేను నిర్మించిన ఈ సినిమాకు సంబంధిన ప్రమోషన్ కార్యక్రమాలకు సినీ పరిశ్రమలోని ప్రముఖులు హాజరు కావడం, టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, లిరికల్ సాంగ్స్ ను, ఆడియోను ఆవిష్కరించడం వంటి సంఘటనలు నన్ను ఆనందపరుస్తున్నాయి” అని పేర్కొన్నారు.
చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్ మాట్లాడుతూ.. “సినిమాలో హీరో పాత్ర అనగానే అందమైన కాస్ట్యూమ్స్ ధరించి, హీరోయిన్ వెంటపడి డ్యూయెట్ లు పాడడం జరుగుతుందని అనుకున్నాను.. కానీ ఈ చిత్రంలో సంఘ వ్యతిరేక శక్తుల కారణంగా మతిబ్రమించి తిరుగుతూ క్లైమాక్స్ కు తెరతీసే ఒకానొక సగటు యువకుని పాత్రలో నటిస్తున్నాను. నాలోని నటుడిని ఆవిష్కరించుకునే అద్భుతమైన ఆస్కారాన్ని ఈ పాత్ర నాకు అందించింది” అని అన్నారు.


